క్రికెట్, బాలీవుడ్ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలైన కేకేఆర్, పంజాబ్ కింగ్స్కు యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఇటీవల సల్మాన్ ఖాన్ను కూడా ఐపీఎల్లో టీమ్ ఎందుకు కొనకూడదు అని అడిగితే, ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ను మీరు ఎప్పుడైనా ఐపీఎల్లో టీమ్ కొనాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి సల్మాన్ స్పందిస్తూ.. ఐపీఎల్కు ఇప్పుడు మేము చాలా ముసలివాళ్లం అయ్యామని నవ్వుతూ సమాధానం చెప్పారు.
కాగా, ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ ఐఎస్పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) లో ఢిల్లీ ఫ్రాంచైజీకి యజమానిగా మారారు. ఐపీఎల్ మొదటి సీజన్ అయిన 2008లోనే తాను ఒక జట్టుకు యజమానిగా మారే అవకాశం వచ్చిందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. కానీ, ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే నాకు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. కానీ నేను తీసుకోలేదు. దీని గురించి నేను ఇప్పుడు బాధపడటం లేదు, సంతోషంగా ఉన్నానని సల్మాన్ ఖాన్ అన్నారు. షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో 55 శాతం వాటాలు కలిగి ఉన్నారు. మిగిలిన 45 శాతం వాటాలు జూహీ చావ్లా భర్త జై మెహతాకు చెందిన మెహతా గ్రూప్ వద్ద ఉన్నాయి. ప్రీతి జింటా 2008 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. ఆమెకు ఆ జట్టులో 23 శాతం వాటాలు ఉన్నాయి. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా 2009లో రాజస్థాన్ రాయల్స్లో 11.9 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఈ వాటాలు 2015 వరకు వారి దగ్గరే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఏ జట్టుకు యజమాని కానప్పటికీ, చాలా ఏళ్ల క్రితం ఢిల్లీ డేర్డెవిల్స్తో (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఢిల్లీ ఈ ఒప్పందం చేసుకుంది.