గిల్పై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ పాల్గొననుండటం గొప్ప విషయమని కొనియాడాడు. ఇది భారత క్రికెట్కు శుభపరిణామమని చెప్పిన లిటిల్ మాస్టర్.. యువ క్రికెటర్లకు మంచి సంకేతాలను ఇస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని శుభ్మన్ గిల్ చాటి చెప్పాడని మెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేనప్పుడు భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 3-1 తేడాతో ఓడిన తర్వాత బీసీసీఐ ఈ నిబంధనను తీసుకొచ్చింది. దాంతోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు దశాబ్దం తర్వాత రంజీట్రోఫీ ఆడారు. శుభ్మన్ గిల్ కూడా దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. అతను నార్త్ జోన్ జట్టును నడిపించనున్నాడు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన గవాస్కర్.. గిల్ నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘దులీప్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ పాల్గొననుండటం మంచి నిర్ణయం. బంగ్లాదేశ్ పర్యటన మరుసటి ఏడాదికి వాయిదా పడింది. అలాగే శ్రీలంకతో కూడా ఎలాంటి సిరీస్ లేదు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ.. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యమిచ్చింది. దాంతో టీమిండియా టాప్ ఆటగాళ్లంతా దులీప్ ట్రోఫీ ఆడనున్నారు. శుభ్మన్ గిల్ నార్త్ జోన్కు సారథ్యం వహించనున్నాడు. ఈ టోర్నీకి అందుబాటులో ఉండి, ఇతర ఆటగాళ్లకు శుభ్మన్ గిల్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్లో పాల్గొన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్లు దులీప్ ట్రోఫీకి దూరంగా ఉండటం మంచి నిర్ణయమే.’అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా శుభ్మన్ గిల్ సత్తా చాటాడు. 754 పరుగులతో రాణించాడు. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్ ఓ సిరీస్లో 774 పరుగులు చేసి టాప్లో కొనసాగుతున్నాడు.