సీబీఐ విచారణ డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ జరిపిస్తున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆపిల్ నుంచి అలర్ట్ సందేశాలు అందాయని వెల్లడించారు. ఈ హెచ్చరికల తర్వాత తాను జాగ్రత్తలు తీసుకున్నానని, అయినప్పటికీ తన సంభాషణలు బహిరంగంగానే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవితల గురించి తాను ఓపెన్గా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నా ఫోన్ కాల్స్ విన్నవారు ఉంటే, వాళ్ల చెవుల నుంచి రక్తం కారి ఉంటుందని అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ వివాదాన్ని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.