మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పీవీని స్మరించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను దేశ పరిస్థితిని మార్చేశాయని గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని అంటూ కొనియాడారు. ’భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.