టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరిత గారు, అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత గారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.
🔹ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.
🔹గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.
🔹”ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.
