- ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలి
- వనమహోత్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్స్లో రుద్రాక్ష మొక్కనాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రధానంగా తల్లులు మొక్కలు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరువిూద మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వెనుకబడిన తరగతులకు మహిళలను ఆర్థికంగా ఎదగడమే తమ లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా రాణిస్తేనే వారికి ఇంటితోపాటు రాష్ట్రంలో, దేశంలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లండిచారు. వారు ఆత్మ గౌరవంతో రాణిస్తే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు పెంచాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.





మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నాం. స్వయం సహాయక సంఘాల్లో కోటి మందిని చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులు అంబానీ, అదానీ వంటి వారే ఏర్పాటు చేసేవారు. రాష్ట్రంలో మహిళలు ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసింది. ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదు. రాజీవ్గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చు కుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని రేవంత్రెడ్డి తెలిపారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని చెప్పారు. దీంతో తర్వాత తరాలకు కూడా ఉపయోగం ఉంటుందని తెలిపారు. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నాగర్ కర్నూల్ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. యూనివర్సిటీలోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించారు.