అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి (జూన్ 12 గురువారం) సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్కారు ఇవాళ సాయంత్రం అమరావతిలో తలపెట్టిన వేడుకలను రేపటికి (జూన్ 13 శుక్రవారం) వాయిదా వేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఈ సభను జరపాలనుకుంది. అంతకుముందు ఈ మీటింగ్ పేరును ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’గా నిర్ణయించి తర్వాత మార్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంవత్సర కాలంలో ఏయే కార్యక్రమాలను అమలుచేశారో, వచ్చే నాలుగేళ్లలో ఏయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారో ఈ సమావేశంలో చెప్పాలని భావించారు. ఈ ఉత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. కానీ.. అనూహ్య పరిస్థితుల్లో రేపటికి వాయిదా వేశారు.