- అక్రమాలకు, అవినీతికి నిలువెత్తు నిదర్శనం..
- మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- ఆర్పీలను,సంఘం అధ్యక్షరాళ్ళను అసభ్య పదజాలంతో దూషిస్తున్న మెప్మాలో ఓ అధికారి
- ఇంత జరుగుతున్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నతాధికారులు
- ఎన్ని పిర్యాదులు వచ్చినా కూరలో కరివేపాకు మాదిరి
- అవినీతి మహిళా అధికారిపై చర్యలు శూన్యం.
ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలను పొదుపు సంఘాలు ద్వారా మహిళలకు అందిస్తున్నారు. ఎంతోమంది పేద, మధ్యతరగతి మహిళలు సంఘాలలో సభ్యులుగా చేరి, ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు ద్వారా కొంత ఆర్థిక లబ్ధి పొందుతున్నారు.ఈ పొదుపు సంఘాలను ఆసరాగా చేసుకుని సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ (మెప్మా) లో ఓ ఔట్సోర్సింగ్ మహిళ ఉద్యోగి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సంఘ బంధం అధ్యక్షురాలు, ఆర్పి ల నుండి పెద్ద మొత్తంలో డబ్బులను దండుకుంటుందని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంఘ బంధం అధ్యక్షురాలు, కొందరు ఆర్పీ ల పట్ల ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాంటి ఫిర్యాదులను అధికారులు కూరలో కరివేపాకుల తీసి పక్కకేస్తున్నారు తప్ప, ఆ మహిళా అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పిర్యాదు చేసినట్లు తెలుసుకున్న సదరు మహిళ అధికారిని ఆర్పి లు,సంఘ బంధం సభ్యులపై వేధింపులు ఎక్కువయ్యారు.
మెప్మాలో ఆమె చెప్పిందే వేదం : మెప్మా కు పెద్ద దిక్కు అయిన అవినీతి అధికారి స్త్రీ నిధి, పొదుపు సంఘాల సభ్యుల నుండి మీటింగ్ ల పేరుతో వేళల్లో డబ్బులు దండుకుంటుందని, ఐకెపి ధాన్యం కొనుగోలులో సైతం ఆమె చేతివటం ఉందని కొందరు ఆర్పీలు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ అధికారి అడిగినప్పుడల్లా ఆర్పీలకు డబ్బులు ఇస్తేనే వారికి పూర్తి సహకారం అందిస్తుందని, లేకపోతే ఆ వార్డులో జరిగే ఎలాంటి మీటింగ్ లు, పొదుపు సంఘాల విషయాల గురించి ఏ సమాచారం కూడా ఇవ్వకుండా, డైరెక్ట్ పొదుపు సంఘం అధ్యక్షురాలు వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకుంటుందని, ఆర్పి లకు కి తెలియకుండానే లోన్లు ఇప్పించడం,పైగా ఆర్పీల పైకి సంఘాల సభ్యులతో పురమాయించి వారికి గొడవలు సైతం పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే కాక మున్సిపల్ కమిషనర్ కి చెప్పి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్తున్నారు. 2008 లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు ఆర్పి (రిసోర్స్ పర్సన్) ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధుల్లోకెక్కిన ఈ అవినీతి మహిళా అధికారి, గత 17 ఏళ్లుగా ఇదే మెప్మా లో అంచలంచలుగా ఎదుగుతూ నేడు మున్సిపాలిటీ పెద్దదిక్కయ్యింది. ఆనాడు సూర్యాపేట జిల్లా నుండి 50 మంది మహిళలు ఆర్పీలుగా ట్రైనింగ్ తీసుకొని విధులు నిర్వహించగా, ఈ మహిళా అధికారి వేధింపులకు (అడిగినంత ఇచ్చుకోలేక) తాళలేక ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. గతంలో ట్రైనింగ్ తీసుకున్న ఆర్పీలు ఇప్పుడు మున్సిపాలిటీలో డజన్ మంది కూడా పనిచేయడం లేదంటే ఈమే గారి వేధింపులు ఏ రేంజ్ లో ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలి.
పనిచేసే ప్రతిచోట అవినీతి మరకే : సుమారు నాలుగేళ్ల క్రితం ఈ అవినీతి అధికారి తిరుమలగిరిలో పని చేసింది. వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు నందించేందుకు 900 మంది పైగా దరఖాస్తు చేసుకోగా ఒక్కో ఫైలుకు రూ. 1000 నుండి రూ. 3,000 వరకు అక్రమంగా వసూలు చేసిందనే అప్పట్లో కోడైకూసింది. అక్కడ పనిచేసిన సమయంలో సుమారు 9 లక్షల రూపాయలకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు పలు పత్రికలలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ మహిళా అధికారి వ్యాపారులకు లోన్ లు సాంక్షన్ చేయడానికి దగ్గరలో ఉన్న మీసేవ లో ఆన్లైన్ చేయించి, మీసేవ నిర్వాహకుడకి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడనుండి సూర్యాపేటకు బదిలీ అయింది. ఆ సమయంలోనే సదరు మీ సేవ నిర్వాహకుడు డబ్బులు ఇవ్వాలని కోరగా తర్వాత ఇస్తా.. సాయంత్రం ఇస్తా.. రేపు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరగడం, ఆ నిర్వాహకుడు అవినీతి అధికారిపై జిల్లా కలెక్టర్ కు గతంలో ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి విషయం బయటపడింది.