- హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా అభివృద్ధి చేసాం
- ఎలీ లిల్లీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం
- తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో 20 నెలల చిన్నకాలంలోనే హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా తీర్చిదిద్దామని ఆయన ప్రకటించారు. ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇది తెలంగాణకు ఒక చారిత్రాత్మక ఘట్టం. పరిశ్రమల అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నాం. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా ఎదగడం ఈ లక్ష్య సాధనకు నిదర్శనం” అని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే దీటైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ దిశగా ఎలీ లిల్లీ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి రావడం గర్వకారణం అని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో 2,000 పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 200 అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయని సీఎం వెల్లడించారు. దేశంలో తయారవుతున్న ప్రతి మూడో టీకా హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతోందని, జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధనాభివృద్ధి కేంద్రంగా ఉన్నదన్నారు.
ఎలీ లిల్లీ ‘గేమ్ ఛేంజర్’
మధుమేహం, క్యాన్సర్, ఇమ్యూనాలజీ, న్యూరో సైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ చేస్తున్న పరిశోధనలు ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ప్రభావితం చేసే గేమ్ ఛేంజర్గా మారతాయి. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల పెరుగుదల కోసం ఎల్లప్పుడూ పరిశ్రమలకు అనువైన మౌలిక వసతులు, స్థిరతతో కూడిన విధానాలను అందిస్తుందని అన్నారు. హైదరాబాద్లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు ఇకపై తెలంగాణ కుటుంబ సభ్యుల్లానే భావిస్తాం. వారి సహకారంతో తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా, ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల నంబర్ వన్ హబ్గా మారుస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలీ లిల్లీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డియాగో రావ్, ఇండియా ప్రెసిడెంట్ విన్సెలోవ్ టకర్, మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ అరోరా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.