- 11 మంది సైనికులు గల్లంతు
- అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ధారాలి గ్రామం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం సంభవించిన మేఘ విస్ఫోటనాలు భయానక ప్రభావాన్ని చూపాయి. ధారాలి, సుఖీ టాప్ ప్రాంతాల్లో రెండు మేఘ విస్ఫోటనాల వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ధారాలి గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఈ విషాదకర ఘటనలో భారత సైనిక శిబిరం కూడా భారీగా దెబ్బతింది. వరదల్లో 11 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మృతదేహాలను గుర్తించారు, 130 మందిని సురక్షితంగా బయటకు తీసినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.