ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆమోదం
చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శుక్రవారం ఆగస్టు1 నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్కు రూ.125 కోట్ల వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయితే, 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు దృష్టికిమంత్రి సవిత తీసుకెళ్లారు. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడంపై సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
కడప జిల్లాలోని జమ్మలమడుగులో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చేనేతల ఉచిత విద్యుత్ అమలుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన రాజధాని రైతు కూలీ పెన్షన్లను కూటమి ప్రభుత్వం తిరిగి మంజూరు చేసింది. ఈ సందర్భంగా కృష్ణయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు రాజధాని రైతులు పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని రైతు కూలీ పెన్షన్లను నిలిపివేసింది. రాజధాని ప్రాంత రైతు కూలీలకు పెన్షన్లు మంజూరైన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు కూలీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను యథావిధిగా కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు కట్టుబడి పెన్షన్లను మంజూరు చేయటం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.