- రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్
- సిబ్బంది ఆరోగ్యంపై సిపి సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్
పోలీసు శాఖ సిబ్బంది ఆరోగ్యమే వారి సేవలకు బలమైన ఆధారం కావాలనే లక్ష్యంతో, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండో విడత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని అంబర్పేట పోలీస్ హెడ్క్వార్టర్లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ, “సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తక ముందే అవి గుర్తించి చికిత్స చేయించుకోవడం అత్యవసరం. అందుకే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి” అని అన్నారు. మునుపటి నెల మల్కాజిగిరి జోన్లో విజయవంతంగా నిర్వహించిన శిబిరానికి కొనసాగింపుగా, శుక్రవారం అంబర్పేట హెడ్క్వార్టర్లో ఎల్బీనగర్, మహేశ్వరం జోన్లకు చెందిన పోలీసు సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మెడికవర్, డా. ఐ అగర్వాల్ ఐ హాస్పిటల్, సౌజన్య డెంటల్ ఆసుపత్రుల వైద్యులు ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి అవగాహన కల్పించిన డాక్టర్ కల్పన, మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులపై డాక్టర్ సురేష్ రెడ్డి విపులంగా వివరించగా, అవసరమైన వైద్య సూచనలను అందించారు. ఈ ఆరోగ్య శిబిరం రేపు కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. శిబిరంలో డీసీపీ ఉషారాణి (ఉమెన్ సేఫ్టీ), డీసీపీ శ్రీనివాసులు (ట్రాఫిక్), డీసీపీ శ్యాంసుందర్ (సీఆర్ఎఫ్ హెడ్క్వార్టర్), రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ కో ఆర్డినేటర్ సావిత్రి, ప్రముఖ వైద్యులు సరిత, అచ్యుతరావు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీహెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో సేవలతో పాటు సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య శిబిరాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. “ఆరోగ్యం ఉన్నదే అసలైన సంపద” అన్న భావనతో ఈ ముందడుగు పోలీస్ అధికారుల మానవతా దృక్పథానికి నిదర్శనం.
