(అవినీతికి అడ్డాగా మారిన చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్)
- ప్రభుత్వ భూమిని కబళిస్తున్న ‘హ్యాబిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’
- అనుమతులు ప్రైవేట్ స్థలానికి, నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో
- జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
- కలెక్టర్ ఆదేశించిన అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకొని సీసీపీ శ్రీనివాస్
- అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- లంచాల మత్తులో చట్టాలను ఉల్లంగిస్తున్న చీఫ్ సిటీ ప్లానర్
వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే చందంగా మారింది ప్రభుత్వ అధికారుల పనితీరు.. వీరు తలుచుకుంటే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం చేయడం పెద్ద పనేమి కాదని తేలింది. నగరం నడిబొడ్డున మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వ భూమిపై కన్నేశారు కొందరు అక్రమార్కులు.. అనుమతులు ఒక సర్వే నెంబర్లో తీసుకొని ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు.. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించడం శోచనీయం. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో వెల్లడించే మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన మున్సిపల్ అధికారులు, లంచాలకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉప్పల్ మండలం, సర్వే నంబర్ 581/1లో ఉన్న సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో, 31 గుంటల స్థలంలో ‘హ్యాబిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే నిర్మాణ సంస్థ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని సమాచారం. ఈ సంస్థ సర్వే నెంబర్ 584లో నిర్మాణ అనుమతులు పొంది, నిర్మాణం మాత్రం ప్రభుత్వ భూమిపై కొనసాగిస్తుండటం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం అవినీతికి నిదర్శనంగా మారింది.
కలెక్టర్ ఆదేశాలకు జిహెచ్ఎంసి కమిషనర్ నిర్లక్ష్యం
ఈ అక్రమ వ్యవహారంపై స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, ఆయన రెవెన్యూ మరియు సర్వే అధికారులతో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో ‘హ్యాబిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థ ప్రభుత్వ భూమిలోనే నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టంగా తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్ వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్కు లేఖ (Lr.No.E2/1063/2023, Dated: 30.08.2024) రాశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న నిర్మాణ అనుమతులు రద్దు చేసి, వెంటనే అక్రమ నిర్మాణ పనులు నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ లేఖ ఇచ్చి దాదాపు 9 నెలలు గడిచినా, నాటి జిహెచ్ఎంసి కమిషనర్ కనీసం పట్టించుకోకపోవడం, నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగడం విస్మయం కలిగిస్తోంది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేసేంత ధైర్యం జిహెచ్ఎంసి అధికారులకు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అధికారుల నిర్లక్ష్యాన్ని, లేదా అంతకు మించి అవినీతిని స్పష్టంగా తెలియజేస్తోంది.

చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ పాత్రపై తీవ్ర ఆరోపణలు:
ఈ దారుణానికి ప్రధాన కారకులు చీఫ్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్, అప్పటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ అని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వీరు బిల్డర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకొని, సర్వే నంబర్ 584లో ఇచ్చిన నిర్మాణ అనుమతులతో సర్వే నంబర్ 581/1లోని ప్రభుత్వ భూమిపై నిర్మాణానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా, గతంలో ఉన్న కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఈ విషయం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసి కమిషనర్ వాస్తవాల ఆధారంగా చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్కు ఆదేశించడం జరిగింది.

అందులో భాగంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ మాధవి నిర్మాణ పనులను నిలిపివేయడానికి నోట్ ఫైల్ పెడితే, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ “ఈ విషయం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎలాంటి పనులు నిలిపివేయలేము” అని బదులివ్వడం ఆయన అవినీతికి పరాకాష్ట అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి, ఈ వ్యవహారంపై కోర్టు నుండి ఎలాంటి ఉత్తర్వులు లేవని, పైగా చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని కోర్టు గతంలో ఆదేశించినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి అధికారులు పన్నిన పన్నాగమని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రభుత్వ ఖజానాకు గండి
ఈ అధికారులు బిల్డర్లు విసిరే “ఎంగిలి మెతుకుల” ఆశపడి, ప్రభుత్వ భూమిలో అక్రమాలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటు. వారి లంచగొండి తనం ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తూ, సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరం.
తక్షణ చర్యలకు డిమాండ్..
ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే, ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు కళ్లు తెరిచి, ఈ అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. చీఫ్ సిటీ ప్లానర్ ఆధ్వర్యంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రభుత్వ భూముల అనుమతులు, అక్రమంగా జారీ చేసిన ఆకు పెన్సి సర్టిఫికెట్లు, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో జరుగుతున్న అవినీతి బాగోతాలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే, హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఇప్పటివరకు అక్రమంగా జారీ చేసిన ఆకుపెన్సి సర్టిఫికేట్లు, అనుమతులు, ఎల్ఆర్ఎస్ విషయాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..