Saturday, July 19, 2025
spot_img

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

Must Read
  • బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు
  • పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
  • కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
  • ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.. నో స్ట్రీట్‌ ఫైట్‌
  • హుజారాబాద్‌ కార్యకర్తలతో ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యలు

హుజూరాబాద్‌ అనేక త్యాగాలకు అడ్డా అని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. కొందరు సామాజిక మధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని చెప్పారు. హైదరాబాద్‌లోని శావిూర్‌పేటలో హుజూరాబాద్‌ భాజపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. గతంలో హుజూరాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమికి చాలా మంది కుట్రలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నేను పోరాటాలు చేస్తే కరీంనగర్‌ ప్రజలు అండగా ఉండేవారు. హుజూరాబాద్‌ గడ్డలో ప్రతి గ్రామంలోని వార్డు సభ్యుడిని గెలిపిస్తామని ఈటల తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, వారిని కడుపులో పెట్టుకుని కాపాడు కుంటానని అన్నారు.

ఇదే సందర్భంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌కి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. హుజురాబాద్‌లో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్‌పేట్‌లోని ఈటెల రాజేందర్‌ ఇంటికి శనివారం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రాజేందర్‌ మాట్లాడారు. హుజురాబాద్‌ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని ఉద్ఘాటించారు. ఇక నుంచి అక్కడ స్ట్రేట్‌ ఫైట్‌ ఉంటుందని.. స్ట్రీట్‌ ఫైట్‌ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్‌ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్‌ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్గాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు.

దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం పెట్టారని ఎంపీ ఈటెల రాజేందర్‌ గుర్తుచేశారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో అన్నిరకాల అంశాలని పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని.. తనకు తెలియని వారు లేరని… బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు. వీరుడు ఎక్కడ భయపడడు. హుజురాబాద్‌ గడ్డ మీద తన ప్రతి అనుచరుడు ఉంటారని వెల్లడించారు. తన సర్పంచులు, ఎంపీటీసీలు, తన వార్డ్‌ మెంబర్లు కూడా ఉంటారని తెలిపారు. దేశ ప్రధాని వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని చెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో కొంతమంది ఉంటారని.. ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని విమర్శించారు. కచ్చితంగా హుజురాబాద్‌ వస్తా.. మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. తనను ఏడుసార్లు గెలిపించారని… ఎవరికీ భయపడేది లేదని రాజేందర్‌ స్పష్టం చేశారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుస మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారుని.. అలాంటిది వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు. ఇక నుంచి హుజురాబాద్‌లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ,కేసీఆర్‌ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని గుర్తుచేశారు. సముద్రంలో తుఫాన్‌ వచ్చే ముందు సైలెంట్‌గా ఉంటదని చెప్పుకొచ్చారు. తన లాంటి వాళ్లు మాట్లాడితే సమాజం రియాక్ట్‌ అవుతుందని.. తాను ప్రజల నుంచి వచ్చిన వాడినని, ప్రజలే తనకు న్యాయ నిర్ణేతలని ఈటెల స్పష్టం చేశారు.

Latest News

హైకోర్టు సిజెగా జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సీఎం రేవంత్‌ తదితరుల హాజరు తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌)...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS