- సిఎం రేవంత్ సంకల్పం ఇదే
- సచివాలయంలో ఫిక్కీ, సిఐఐ తదితర సంస్థలతో శ్రీధర్ బాబు
తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి… ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఐఐ, ఫిక్కీ, ఎఫ్ టీసీసీఐ, ఎలీప్, టిఫ్, టాప్మా, టీఎస్ టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ’తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం అన్నారు. చట్టాలు, నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉంటాం. అలాగే… కార్మికుల ప్రయోజనాలను కాపాడుతాం అని వివరించారు. ’గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా వ్యహరించం. మాది అందర్నీ కలుపుకుని పోయే ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. వాటిని ఆచరణలో పెడతాం. పారిశ్రామికాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రయాణంలో పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించాం. అందుకే… పలు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేధో మథనం చేశాం’ అని పేర్కొన్నారు.
’పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారింది. ఏడాదిన్నర వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చాం. ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించాం. అయినా… రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ బీఆర్ఎస్, బీజేపీ మాపై దుష్పచ్రారం చేస్తుంది’ అని కొత్తగా రాష్ట్రానికొచ్చిన పెట్టుబడుల గురించి సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో తెలంగాణ మినమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ బి.జనక్ ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సవిూవుద్దీన్, రాజీవ్ వెంకటరమణ, రాంచంద్రారావు, శేఖర్ రెడ్డి, జయదేవ్, రాజీవ్, సుజాత, రమాదేవి, సుధీర్ రెడ్డి, సునీల్, గౌతమ్, అరుణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.