హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డు రెడ్డి కాలనీలో నివాసులు బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలు కుటుంబాలు పాల్గొన్నాయి. స్థానికులు మాట్లాడుతూ.. పట్టణంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే 2వ వార్డు, 14వ వార్డుల్లో ఇప్పటికే నిర్మించిన కొన్ని సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని అధికారులు, పట్టణ అభివృద్ధి విభాగంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, రోడ్డు పనులు వాయిదా వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.