Wednesday, June 25, 2025
spot_img

విశ్వ శాంతి కోసం ప్రపంచయోగా దినోత్సవం

Must Read

నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్‌ మధ్య, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య, భారత పాకిస్తాన్‌, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ జాతుల మధ్య సరిహద్దుల వివాదం, భూ భాగం కోసం, మతోన్మాదం కోసం, అణ్వాయుధాల వ్యాపారం కోసం, మత్తు మందుల కొనుగోలు కోసం, లేక అగ్ర దేశాలు మధ్య ఆధిపత్య పోరు, అహంకారం, మూఢ విశ్వాసాలు… ఇలా ఎందుకో అందుకు ప్రతి నిత్యం యుద్ధ వాతావారణంలో అమాయకులైన ప్రజలు భయంతో బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా జూన్‌ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరిపించడం నిజంగా అభినందనీయం. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన వివరణ ప్రకారం ‘‘యోగా’’ అంటే కేవలం క్రింద కూర్చుని ఆసనాలు వేయడం మాత్రమే కాదు. ‘‘యోగా’’ అనేది శరీరం, మనసు, ఆత్మలను ఏకీకృతం చేస్తుంది. ఇది జీవితానికి శాంతిని, ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సుని సమగ్రంగా అందించే ప్రక్రియ. ‘‘మన కోసం, మరియు మన సమాజం కోసం యోగా’’ అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఐక్యత మరియు సామరస్య దినంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సహజ యోగా ధ్యాన ఆవిష్కర్త పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి విశ్వ శాంతి స్థాపన కోసం ఐక్య రాజ్య సమితిలోనూ ఇంకా అనేక దేశాల్లోనూ పర్యటించినప్పుడు ఇచ్చిన సందేశాలను నేటి ప్రపంచ యోగ దినోత్సవం రోజున మనం మననం చేసుకోవడం ఎంతైనా ముదావహం.

ఈ రోజుల్లో చాలా మంది ‘‘యోగ’’ అంటే కేవలం ఆసనాలు, సూర్య నమస్కారాలు అని అనుకుంటున్నారు. నిజానికి పతంజలి మహర్షి రచించిన యోగ శాస్త్రములో అష్టాంగ యోగ మార్గమును సూచించడం జరిగింది. నిజానికి ‘‘యోగ’’ అనే పదానికి అర్థం ఇంకా చాలా విస్తృతమైనది మరియు చాలా సూక్ష్మమైనది. సంస్కృత భాషలో ‘‘యోగ’’ అనే పదానికి ‘‘కలయిక’’ అనే అర్థం ఉంది. ప్రతీ మానవునిలో అంతర్గతంగా ఉండే భగవంతుని శక్తి జాగృతి చెంది, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని శక్తి తో కలయిక చెందడాన్నే ‘‘యోగ’’ అని పిలుస్తారు. మానవుడు కూడా భగవంతుని సృష్టి నుండి వచ్చినప్పటికీ అతని బుద్ధి అహంకారముతో కప్పబడి అతనికి భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులన్నింటినీ తన వ్యక్తిగత విజయాలుగా భావించి, తానే గొప్పవాడిననే అహంకారముతో ఉంటాడు. ఎప్పుడయితే అతను అహంకారమును విడిచి పెట్టి, సర్వ వ్యాపితమైన భగవంతుని శక్తితో యోగమును పొందుతాడో, అప్పుడు అతని పరిధి అనంతమవుతుంది మరియు అతని శక్తి కూడా సముద్రం వలె అనంతమవుతుంది.

వేదిక మీదకు ఎక్కి గొంతెత్తి శాంతి, శాంతి అని చెప్పినంత మాత్రాన ప్రపంచంలో శాంతి స్థాపన చేయలేము. అలా మనిషిలోనే ప్రశాంతత లేనప్పుడు శాంతి సాధన కోసం చర్చలు జరపడంవలన ఫలితమేముంటుంది? ఒకవేళ ఏదో శాంతి కోసం చర్చలు జరుపుకున్నా, ఒప్పందం చేసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ అశాంతి మొదలవుతుంది. మనలోని ఆత్మ ద్వారా శాంతి వ్యక్తీకరింపబడాలి. ముందుగా శాంతి అనేది మనలో ఉండాలి. మనం అంతర్గతంగా మానసిక ప్రశాంతతతో ఉండాలి. అంతేగానీ మనలో అశాంతి ఉన్నప్పుడూ, అహకారంతో మనం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు, ‘నేనెంతో ప్రశాంతంగా వున్నాను’ అని అనుకోవడం కేవలం ఒక భ్రమ. మనశ్శాంతి అనేది ఆనందానుభూతిని కలిగించేదిగా ఉండాలి. శాంతి కోసమని యుద్ధాలు చేయనవసరం లేదు. అది అంతర్లీనంగా ఆత్మ ద్వారా అనుభూతి చెందాలి. అంతర్గతంగా ప్రశాంతతతో వున్న వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు మరియు అందరికీ ఆనందాన్ని పంచుతారు. ఇలా ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న సమస్యలకు సహజయోగం చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ప్రతి మనిషిలోను నిద్రాణ స్థ్తితిలో వున్న దైవ శక్తి అయిన కుండలిని శక్తిని జాగృతి చేసి ఆత్మ సాక్షాత్కారం పొందగలిగినప్పుడు, ఆ సమయంలో, మన హృదయం మరియు మన మెదడు మధ్య ఐక్యత ఏర్పడుతుంది – ఇదే సహజ యోగం. ఈ కాంతి మన లోపలికి వచ్చినప్పుడు, మన జీవితం నెమ్మదిగా, స్థిరంగా మారడం, పరివర్తన చెందడం మనం గ్రహిస్తాము. అప్పుడు మానవులలో అత్యున్నత శ్రేణికి చెందిన ఒక కొత్త కోణాన్ని మనం చూస్తాము. రూపాన్ని గురించి చింతించడం, ప్రత్యేకమైన ఇష్టాలు లేదా అయిష్టాలు, అనవసరమైన ఆలోచనలు అలాంటివేమీ ఉండవు. శాంతి క్రమంగా స్థిరపడటం ప్రారంభమవుతుంది. మనలో స్థిరపడిన ఈ అంతర్గత శాంతి కేవలం మనల్నే కాక, మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది.

(సహజయోగ సృష్టి కర్త పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS