కొద్దిరోజులుగా యుద్ధం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఇవాళ (జూన్ 24 మంగళవారం) అధికారిక ప్రకటనలను జారీ చేశాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధం భయాలు తొలిగాయంటూ అభిప్రాయపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం, హెచ్చరికలతో రెండు దేశాలు దిగొచ్చాయి. ఈ ఒక్క రోజే పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత.. ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ప్రకటించారు. కానీ.. ఆ ప్రకటనతో ఇరాన్ విభేదించింది. కొద్దిసేపటి తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే.. ఇవాళ సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్ సీరియస్ అవటంతో కాల్పుల విరమణకు కట్టుబడతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.