Wednesday, July 23, 2025
spot_img

టెస్టు క్రికెట్‌ చరిత్రలో సంచలనం

Must Read
  • సంచలన మార్పులకు సిద్ధమైన ఐసీసీ
  • 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు
  • డబ్ల్యూటీసీ 2027- 29 నుంచి అమలయ్యే అవకాశం
  • ఈ ఏడాది చివరకల్లా పూర్తి స్థాయి నిర్ణయం

టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ సంచలన మార్పులకు సిద్ధమైంది. 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది. జై షా నేతృత్వంలో సింగపూర్‌ వేదికగా జరిగిన సమావేశంలో ఐసీసీ టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టింది. సంజోగ్‌ గుప్తా నేతృత్వంలోని వర్కింగ్‌ గ్రూప్‌ ఈ ఏడాది చివరినాటికి సిఫార్సులు చేయనుంది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు డివిజన్‌-1లో ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 133 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత విప్లవాత్మక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. టెస్టు క్రికెట్‌ను రెండు గ్రూపులుగా విభజించేందుకు ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఐసీసీ ఛైర్మన్‌ జై షా , సీఈఓ సంజోగ్‌ గుప్తా నేతృత్వంలో జరిగిన తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన వర్కింగ్‌ గ్రూప్‌ ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీకి సిఫార్సులు సమర్పించనుంది. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. అందులో ఒకదాంట్లో ఆరు, మరోదాంట్లో ఆరు లెక్కన రెండు డివిజన్లుగా విభజించి టెస్టు క్రికెట్‌ ఆడించనున్నారు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో ప్రస్తుతం తొమ్మిది జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి.

డబ్ల్యూటీసీ 2027-29 సైకిల్‌ నుంచి రెండు గ్రూపులు ఆడనున్నాయి. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ నుంచి ఇటీవల ఐసీసీకి వచ్చిన సంజోగ్‌ గుప్తా ఈ వర్కింగ్‌ గ్రూప్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సీఈఓ రిచర్డ్‌ గోల్డ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ సీఈఓ టాడ్‌ గ్రీన్బర్గ్‌ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండటం విశేషం. ఈ రెండు డివిజన్ల విషయం కూడా 2024 జనవరిలో మహిళల యాషెస్‌ సిరీస్‌ సమయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మధ్య చర్చల్లో వచ్చిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ కొత్త ఫార్మెట్‌కు ఎక్కువ ఆసక్తి చూపుతోంది. భారత్‌, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా జట్లతో మూడు సంవత్సరాలకు రెండు సార్లు ట్రై సిరీస్‌ ఆడిరచేలా కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ ప్రకారం భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు డివిజన్‌ -1లో ఉండే అవకాశం ఉంది. డివిజన్‌ -2లో పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌తో పాటు ఐర్లాండ్‌, అప్ఘనిస్తాన్‌, జింబాబ్వే జట్లు డివిజన్‌ -2లో ఉండనున్నాయి.

అయితే ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లాలంటే 12 ఐసీసీ ఫుల్‌ మెంబర్స్‌లో 2/3వ వంతు మద్దతు కచ్చితంగా కావాలి. సింగపూర్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాబోయే మూడు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు ఇంగ్లండే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. రానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ భారత్‌లో నిర్వహించాలని కోరినప్పటికీ అది నెరవేరలేదు. ఈ సమావేశంలోనే టీ20 ఛాంపియన్స్‌ లీగ్‌/ వరల్డ్‌ క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌పై కూడా చర్చలు జరిగినా ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక ప్రతిపాదన రాలేదు.

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS