భారీ కేక్ను కత్తితో కోసిన మాజీ సీఎం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) 78వ పుట్టిన రోజును ఘనంగా, వెరైటీగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని లాలూ ఇంట్లో 78 కిలోల భారీ లడ్డూ కేక్ను పొడవైన కత్తితో కోశారు. మామూలుగా ఎవరైనా తమ పుట్టిన రోజు సంబరాల్లో కేక్ను చాక్తో కట్ చేస్తారు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కత్తితో కట్ చేయటం వెరైటీగా అనిపించింది. ఈ వేడుకకు లాలూ ప్రసాద్ యాదవ్ అనుచరులు, పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు.
లాలూ యాదవ్ జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమంలో వైరలైంది. కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. లాలూ ప్రసాద్ యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తమ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో పాతుకుపోయిన లోతైన మానవ సంబంధం అని ఎక్స్లో పోస్టు పెట్టారు.