తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ లభించకపోవటంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇవాళ (జూన్ 9 సోమవారం) మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మునిసిపాలిటి పరిధిలోని తొర్రూర్లో ఆయనతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్రెడ్డితో మాట్లాడారు. ఆలస్యమైనా పార్టీ నీకు న్యాయం చేసి తీరుతుందని, అప్పటివరకు ఓపిక పట్టాలని మంత్రి శ్రీధర్బాబు మల్రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని, కార్యకర్తలను కాపాడిన నాయకుడు మల్రెడ్డి అని చెప్పారు. మల్రెడ్డి కాంగ్రెస్లో సీనియర్ లీడర్ అని, ఆయన ఆవేదనను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్, పార్టీలోని ఇతర పెద్దలు మల్రెడ్డిని కలిసి మాట్లాడటం జరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికావొద్దని కోరారు.