- పహల్గామ్ ఉగ్రవాదుల హతం
- నలుగురిలో ముగ్గురిని మట్టుబెట్టినట్లు సమాచారం
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.. రెండు నెలల క్రితం పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలే ఎన్కౌంటర్ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)‘ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. అయితే, ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ అనుమానిత ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్లో సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఉగ్రవాదులు సైన్యం జరుపుతున్న ఎన్కౌంటర్లో చిక్కుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. హిర్వాన్ – లిద్వాస్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోంది. గత 2 నెలలుగా ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ‘ఆపరేషన్ మహదేవ్‘ పేరుతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టి, ఉగ్రవాదుల్ని హతం చేశారు. భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. నివేదికల ప్రకారం, ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. కనీసం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని తెలుస్తోంది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తయిబా అనుబంధ సంస్థ ’ది రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.