కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, వెంటనే తగిన మోతాదులో యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన జేపీ నడ్డా, ఈ నెల 21నాటికి ఆంధ్రప్రదేశ్కు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించాలనే లోకేశ్ అభ్యర్థనను కేంద్ర మంత్రి ఆమోదించారు. అదేవిధంగా విశాఖపట్నంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ శాశ్వత క్యాంపస్ స్థాపనకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అవసరమైన 100 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని లోకేశ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని లోకేశ్ కేంద్రమంత్రికి వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, అమరావతి రాజధాని పనులు మళ్లీ పట్టాలెక్కాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.