టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కు సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ ముఖ్య ప్రతిపాదన
గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి పై పౌర సమాజంలో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, సిస్టమ్ పై ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి తెలంగాణలో కొన్ని అత్యవసర, బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ భావించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కు లుబ్నా సర్వత్ ముఖ్య ప్రతిపాదనను సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన ఎథిక్స్ (నీతులు) మంత్రిత్వ శాఖ లేదా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి నిర్మూలన కోసం ఎథిక్స్ ఆఫీసర్ను నియమించిన విషయం తెలిసిందే. అదే విధంగా, పార్లమెంట్ లో ఎల్లప్పుడూ ఎథిక్స్ కమిటీ పని చేస్తూనే ఉంది. 2000లో అప్పటి లోక్సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి ఆధ్వర్యంలో అద్హాక్ ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయబడగా, అది 2015లో శాశ్వతంగా మారింది. ఇక, బీజేపీ/ఎన్డీఏ వంటి రాజకీయ సంస్థలతో వేరే రంగాల్లో పోటీ చేయలేకపోయినా, తెలంగాణలో నిజాయితీగల, నైతిక పాలన ద్వారా ప్రజల మద్దతును గెలుచుకోవచ్చు అనే స్పష్టమైన అభిప్రాయం ఈ ప్రతిపాదనకు వెనక ఉంది.
ఎన్నికల్లో కొందరు పార్టీలు అధిక మొత్తంలో రాజ్యాంగ విరుద్ధంగా వేల కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్లను సొంతం చేసుకుంటున్నా, ప్రజలకు నిబద్ధత, పారదర్శకత, నైతికతతో కూడిన పాలన అందించడం ద్వారా ప్రజలలో కొత్త ఆశను రేకెత్తించవచ్చని పౌర సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదన పై సానుకూలంగా స్పందించి, అవినీతికి చరమగీతం పాడే విధంగా ఎథిక్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా పాలనలో నిజాయితీకి నూతన శకం ప్రారంభించాలని కోరారు..