ఇరాన్ నుంచి ఇండియాకి 517 మంది భారతీయుల తరలింపు
పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఇండియా చేసిన యుద్ధం పేరు ఆపరేషన్ సింధూరం. ఇప్పుడు ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన కార్యక్రమం పేరు ఆపరేషన్ సింధు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 517 మంది భారత పౌరులను సేఫ్గా తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విద్యార్థులతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం జూన్ 20న (శుక్రవారం) రాత్రి పదకొండున్నరకు ఢిల్లీకి చేరిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్.. సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వీరికి విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్ ఛటర్జీ.. ఎయిర్పోర్టులో స్వాగతం చెప్పారు. ఇరాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఆపరేషన్ సింధు ఇకమీదగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూన్ 21న (శనివారం) ఉదయం తుర్క్మెనిస్థాన్ రాజధాని అష్గాబాత్ నుంచి ఇంకో విమానం ఢిల్లీకి చేరింది. వీరితో కలిపి ఆపరేషన్ సింధు కింద ఇండియాకి తిరిగొచ్చిన మొత్తం పౌరుల సంఖ్య 517కి చేరింది. జూన్ 19న (గురువారం) తొలి విమానంలో 110 మంది వచ్చారు.