జగ్దీప్ ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఆకాంక్ష
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా సమర్పించగా.. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్ఖడ్ రాజీనామా చేస్తున్నాట్లుగా ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాపై ఎలాంటి అనుమానాలు ప్రభుత్వం పక్షాన వ్యక్తం కాలేదు. సరికదా ఆయన ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి పదవితో సహా వివిధ హోదాల్లో ధన్ఖడ్ దేశానికి సేవలు అందించారని అన్నారు.
రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ధన్ఖడ్.. రాత్రి కల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా నేను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నా. బాధ్యతల నిర్వహణలో నాకు అండగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు. పదవీకాలంలో మేం చాలా ప్రశాంతమైన, అద్భుతమైన వర్కింగ్ రిలేషన్ను కొనసాగించాం. ప్రధాన మంత్రి, మంత్రి మండలికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని ధన్యవాదాలు చెప్పారు.
2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దేశ 14వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సోమవారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రాత్రికి అదే కారణంతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ధన్ఖడ్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆరోగ్య అంశం కంటికి కనిపిస్తున్నా కనిపించనివి ఏవో దీనివెనక ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తంచేసింది.