ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ (జూన్ 9 సోమవారం) ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంట్లోకి ఏపీ పోలీసులు మఫ్టీలో వెళ్లి అరెస్ట్ చేసి తమ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముందస్తు నోటీసులు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటికి ఎలా వస్తారని కొమ్మినేని నిలదీయగా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. కేసు వివరాలను అడగ్గా పోలీసులు జవాబు చెప్పలేదు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల గతేంటని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదనే దురద్దేశంతో గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.