Thursday, June 26, 2025
spot_img

వృద్ధ దంపతులకు న్యాయం

Must Read

గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ, వారి ఐదుగురు కుమార్తెలకు అప్పగించిన ఆస్తి బదిలీ (గిఫ్ట్ డీడ్)ను సదరు ఆర్డీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు “మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007” చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఇవ్వబడింది.

వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ మలేపాటి మోహన్ రావు (వయస్సు 86) మరియు ఆయన భార్య శ్రీమతి మలేపాటి గౌరమ్మ (వయస్సు 75) లు గతంలో స్వంతంగా స్వీట్స్ వ్యాపారం నడుపుతూ జీవించారు. వయోవృద్ధత, ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారం సన్నగిల్లింది. తమ సంతానమైన ఐదుగురు కుమార్తెలపై నమ్మకంతో, రంగయ్యగారి సత్రం వీధిలో ఉన్న నివాస గృహాన్ని (డోర్ నెం. 18/437-A) 2024 జూలై 23న నమోదు చేసిన డాక్యుమెంట్ నెం. 29419/2024 ద్వారా బహుమతిగా బదిలీ చేశారు. కానీ ఆస్తి బదిలీ అయిన వెంటనే, తమ కుమార్తెల ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని మోహన్ రావు పేర్కొన్నారు. జీవితాంతం సంరక్షణ కల్పిస్తామన్న మాటలు, హామీలు అన్నీ వృథా అయ్యాయి. వారికి తిండి, దుస్తులు, వైద్య సాయం వంటి కనీస అవసరాలు కూడా అందించక, పక్కవారిని, సేవా సంస్థల దయపై ఆధారపడే స్థితికి చేరుకున్నట్లు తెలిపిన ఆయన, చివరికి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్టు తెలిపారు.

ఈ దంపతుల వేదనకు స్పందించిన జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ ఐదుగురు కుమార్తెలకు ఫిబ్రవరి 22, 2025న ఆర్డీవో కార్యాలయం లో హాజరు కావలసినదిగా నోటీసులు జారీ చేశారు. తదనంతరం మార్చి 12, మార్చి 29 మరియు ఏప్రిల్ 19 తేదీల్లో కూడా విచారణలు జరిపారు. అయితే ప్రతివాదులు పూర్తి స్థాయిలో విచారణలో హాజరు కాక, తమ సంరక్షణ బాధ్యతను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.

అయితే పిటిషన్ దారులు మాత్రం అసలు గిఫ్ట్ డీడ్, ఆధార్ కార్డులు, వైద్య పత్రాలు (ఆర్థరైటిస్, హై బిపి వంటి ఆరోగ్య సమస్యల రికార్డులు), పొరుగువారి ప్రమాణాలు వంటి బలమైన ఆధారాలను సమర్పించారు. ఇది వాళ్లను పూర్తిగా విస్మరించినట్టు స్పష్టమైన నిర్ధారణ ఇచ్చింది.

ఆర్డీవో ఇచ్చిన తుది ఉత్తర్వులు:

  1. గిఫ్ట్ డీడ్ రద్దు: డాక్యుమెంట్ నెం. 29419/2024, తేది 23.07.2024 న నమోదైన ఉపకారపు దస్తావేజును చెల్లదు (null and void ab initio) గా ప్రకటించారు. ఆస్తి పునరుద్ధరించబడి మోహన్ రావు యాజమాన్యంలోకి వస్తుంది.
  2. ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశం: ఐదుగురు కుమార్తెలు 15 రోజుల్లో ఆ ఇంటిని ఖాళీ చేసి మోహన్ రావు దంపతులకు అప్పగించాలి. దీని అమలును ప్రొద్దుటూరు తహసీల్దార్ పర్యవేక్షించాలి.
  3. ఆస్తి రక్షణ: ఆస్తిపై ఎటువంటి విక్రయం, అద్దె, బదిలీ వంటి కార్యక్రమాలు చేయరాదు.
  4. శిక్షా నిబంధనలు: ఈ ఉత్తర్వులు పాటించకపోతే, చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష లేదా ₹5,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
  5. అపీలు అవకాశం: ఎవరైనా ఈ ఉత్తర్వుతో అసంతృప్తి చెందితే, జిల్లాకలెక్టర్ ముందు 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయవచ్చు.

సమాజానికి సందేశం:
ఈ తీర్పు, వృద్ధులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు హెచ్చరిక. తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తులు తీసుకుని వదిలేసే వారిని చట్టం ఉపేక్షించదన్న సంకేతాన్ని ఇచ్చింది. వృద్ధుల గౌరవం, సంక్షేమం రక్షించాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని ఈ నిర్ణయం పునరుద్ఘాటించింది.

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS