ఆడబిడ్డలకు సిఎం శుభాకాంక్షలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. 18 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా సాగుతోన్న మహాలక్ష్మీ స్కీమ్ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ స్కీములో భాగంగా ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహాలక్ష్మీ స్కీమ్ ఈ అరుదైన ఘనత అందుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి సీఎం రేవంత్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.