శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్, రన్వేను డెవలప్ చేయనున్నారు.
2026-27లో ఈ పనులను ప్రారంభించి 2029 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్జీఐఏను ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికుల కోసం, గంటకు 42 ఫ్లయిట్ల రాకపోకల కోసం నిర్మించారు. 2017-18లో 1.83 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఏటా 7.1 శాతం వృద్ధి రేటుతో గత ఆర్థిక సంవత్సరంలో 2.95 కోట్లకు పెరిగింది. విమానాల సంఖ్య గంటకు 36కు చేరింది. దీంతో ఎయిర్పోర్టు త్వరలోనే మ్యాగ్జిమమ్ కెపాసిటీకి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో విస్తరణ అవసరం ఏర్పడింది.