- ఉచిత ప్రయాణంతో ఆర్టీసికి రూ.6680 కోట్ల ఆదాయం
- 200 కోట్ల ఉచిత ప్రయాణాలపై డిప్యూటి సిఎం వెల్లడి
- మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన భట్టి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణాల వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.

ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణికులు 6680 కోట్లు ఆదా చేసుకున్నారు వారికి శుభాకాంక్షలు. మునిగిపోతున్న పడవ ఎందుకు ఎక్కుతారని ఆరోజు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ. 200 కోట్ల మహిళా ప్రయాణికుల చార్జీలను 6680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. భవిష్యత్తులో కూడా మీ చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వచ్చిన ఆదాయం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.

ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం ఉంటే.. ఇప్పుడు 97 శాతంకి పెరిగింది. మహాలక్ష్మికి ముందు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే.. ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచన చేశారు. కాలుష్య రహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పటికే 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే 11 శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి, దానిని పెంచుకుంటూ పోతున్నారు. మహాలక్ష్మి పథకం విరివిగా ఉపయోగించి 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకొని మీరు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నారు, నగరాల్లో పనికి ఉపయోగించుకున్నారు, అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. మీరు 6680 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు అదా చేసుకున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది.

ఆర్టీసీలో కేవలం ప్రయాణమే కాదు.. ఆర్టీసీ బస్సులకు యాజమానులను చేశాం. వడ్డీలేని రుణాలు ద్వారా బస్సులు కొనుగోలు చేయించారు. 150 మహిళా సంఘాల ఆర్టీసీ బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు ఇటీవలే అందించాం. ఇప్పటికే 25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించాం. ఈ 5 ఏళ్లలో లక్ష కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమత్తులు ,అభివృద్ధి చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నారు. దీని ద్వారా రవాణా మరింత అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

