రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో ఇన్నాళ్లూ ఆటపాటలకు పరిమితమైన విద్యార్థులు మళ్లీ భుజాలకు బ్యాగులు తగిలించుకొని బడిబాట పట్టారు. పిల్లలకు సుస్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పాఠశాలలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, పూల దండలు కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. కొన్ని చోట్ల విద్యార్థులకు పుష్పాలతో స్వాగతం పలకటం గమనార్హం. పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించటం కోసం ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాం, బుక్స్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా సిద్ధం చేశారు. 12 జిల్లాల్లోని ప్రైమరీ పాఠశాలల్లో ప్రిప్రైమరీ క్లాస్లను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.