మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఫిలింనగర్ డౌన్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్తో కలిసి చేపట్టిన భారీ ప్రాజెక్టులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలింనగర్ సైట్ మరోసారి చర్చకు రావడం గమనార్హం. రంజిత్ రెడ్డి గత కొన్నేళ్లుగా డిఎస్ఆర్తో భాగస్వామ్యం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు సహా 20కి పైగా ప్రదేశాల్లో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ రెడ్డి వ్యక్తిగత కార్యాలయాలు, డిఎస్ఆర్ కంపెనీకి చెందిన ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై అధికార వర్గాల నుండి అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, పన్ను ఎగవేత, పెట్టుబడుల లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోందని ఐటీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.