ఇలాంటి విద్య బోధన రాష్ట్ర ప్రభుత్వ పాలనకే సిగ్గుచేటు
*ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని విరాళం ఇస్తే మాకు పాఠశాల నిర్మాణం అవుతుంది
- USFI సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి గారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మరియు సిబ్బందితో మాట్లాడిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం పక్కన రోజు కూర్చొని పాఠాలు వింటున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల దుస్థితి పాలకులకు కనిపించట్లేదా…? ఇంతకంటే అవమానవీయమైన దుస్థితి ఇంకెక్కడైనా ఉంటుందా..!

- ఓట్ల కోసం ప్రజలకు కోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఒక కోటి రూపాయలు వెచ్చించి సొంత భవనాలను నిర్మించలేక మూడు సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాల కోసం నిర్మించిన డబల్ బెడ్రూంలో ప్రభుత్వ పాఠశాలలను నడుపుతున్నారు. దీనివల్ల అందులో చదువుతున్న దాదాపు 600 పైగా విద్యార్థులు డబల్ బెడ్ రూమ్ హాల్లో నిర్మించిన అటాచ్డ్ బాత్రూమ్స్ పక్కన కూర్చొని పాఠాలు వింటూ చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ఒక షేల్టర్ కూడా లేదు. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని అరు బయట ఎండలో నిలబడి తినాల్సిన దుస్థితి ఏర్పడింది.

- గతంలో పలుమార్లు అధికారులకు, స్థానిక నాయకులకు చెప్పినా నిధులు లేవని సొంత భవనం నిర్మించడానికి పునాది వేయలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులు విద్యను అభ్యసించడం రాష్ట్ర ప్రభుత్వ పాలనకే సిగ్గుచేటు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మంత్రులు ఒకసారి ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే విధంగా నూతన భవన నిర్మాణాన్ని చేపట్టగలరని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు…

