రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఇవాళ (జూన్ 24 మంగళవారం) సాక్ష్యం చెప్పిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రజల ప్రాణాలు తీసే వారి మీద పెట్టాల్సిన నిఘాను తమ మీద పెట్టారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేను నా భార్య మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారు. ఇది సిగ్గుచేటు. ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చింది ఎవరో నిగ్గు తేల్చాలి. SIB, ఇంటెలిజెన్స్ అన్నీ సీఎంల అధీనంలో ఉంటాయి. అప్పటి సీఎం కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి. చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలి. లేదంటే వారితో ఈ ప్రభుత్వం కుమ్మక్కయినట్లే అని భావించాల్సి ఉంటుంది’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాలయాపన చేస్తూ ఎవరికి లాభం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మీకు చేతకాకపోతే నిజాయితీగా సీబీఐకి అప్పగించండి.. వారే తేలుస్తారు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.