బంజారా భవన్లో సందడి.. పాల్గొన్న మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తీజ్ ఉత్సవాల సందర్భంగా సేవలాల్ మహరాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయానుసారం బంజారా మహిళలు మంత్రివర్యుల తలపై గోధుమల మొలకల బుట్టను ఉంచారు. తరువాత మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యంలో పాల్గొని ఉత్సవ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి బంజారా సోదర సోదరీమణులకు “రాం రాం” అంటూ తీజ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. “మన సంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు అనుగుణంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం. సేవలాల్ మహరాజ్, మేరీమా యాడి ఆశీర్వాదంతో పాడి పంటలతో సుఖసంతోషాలు నిండిన జీవితం అందరికీ కలగాలి” అని అన్నారు. గోధుమలు తొమ్మిది రోజులు నానబెట్టి జరుపుకునే ఈ పూజా కార్యక్రమం విశ్వాసంతో పాటు ప్రజల సంక్షేమం కోసం చేసే ఆచారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మొత్తం, ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో అభివృద్ధి సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.