- రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది
- రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నెంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ, గోదావరి జలాల పంపకంలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని, 2014 నుంచి 2023 వరకు కృష్ణా నది నుంచి ఏపీకి ఏటా 512 టీఎంసీల నీటిని తరలించుకొని పోతుంటే టిఆర్ఎస్ సర్కార్ చోద్యం చూసిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో దెబ్బతిన్నదని, తెలంగాణను సర్వనాశనం చేసి ఏం తెలియనట్టు హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు పేరు మార్చుకొని గోబెల్స్ రావుగా నామకరణం చేసుకోవాలని హితువు పలికారు.

గత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి అంచనాలు పెంచి వేరకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు.
జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి: కృష్ణా నదిపై రూ 302 కోట్లతో నిర్మాణంలో ఉన్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన ఆయన అసంతృప్తితో ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ పనులను విద్య ప్రాతిపదికన, వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా అలింగాపురం, రాఘవాపురం బొత్తలపాలెం, కోమటికుంట, మీగడం పహాడ్ తండా, చెరువు తండా, హనుమయ్య గూడెం, పాలకవీడు, సజ్జాపురం, నాగిరెడ్డిగూడెం గ్రామాలలోని పదివేల ఎకరాలకు సాగునీరుతో పాటు జాన్ పహాడ్ చెరువుకు నీరు అందించడం జరుగుతుందన్నారు.
పనుల్లో జాప్యం జరిగినట్లు అనిపిస్తే నిర్మోహమాటంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు కలిగే నష్టం పై బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్ సిఈ రమేష్ బాబు,ఎస్ ఈ శివ ధర్మ తేజ, డి ఈ నవీకాంత్, సీఐ చరమంద రాజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గోపాల్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.