Thursday, July 3, 2025
spot_img

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

Must Read
  • టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
  • అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
  • విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
  • సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
  • ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు
  • టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై చర్యలకు డిమాండ్

ప్రజల పునాది హక్కులైన సమాచారం తెలుసుకునే హక్కును రక్షించడానికి రూపొందించిన సమాచార హక్కు చట్టానికి అవినీతి ప్రేరిత శక్తులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్న‌ట్లు తెలుస్తుంది..

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తుకు సంబంధించి తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని, కీలక వివరాలను దాచిపెట్టారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనంపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది.

వివాదానికి దారి తీసిన దరఖాస్తు:
కె. విజయ్ కుమార్ అనే దరఖాస్తుదారు, ఉప్పల్ ఖల్సా గ్రామంలోని సర్వే నెం. 581/1 లో ఉన్న ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నివసిస్తున్న వారికి విద్యుత్ సరఫరాపై ఫిర్యాదు చేశారు. 24.05.2025 నాటి ఈ ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికలు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నుండి హబ్సిగూడలోని టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)కు పంపిన డిస్పాచ్ నెం. 789 మరియు 863 గల ఫైళ్ల వివరాలను ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.

అయితే, డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పి. సుబ్బారావు ఉద్దేశపూర్వకంగా ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించినట్లు తెలుస్తోంది. కోరిన సమాచారం సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 2(j)(ii) ప్రకారం “సమాచారం” యొక్క నిర్వచనం పరిధిలోకి రాదని, దీనిని “కొత్తగా సృష్టించాల్సిన అవసరం” ఉంటుందని ఆయన తిరస్కరణ లేఖలో పేర్కొన్నారు. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలు మరియు డిస్పాచ్ నంబర్లతో కూడిన ఫైళ్ల వివరాలు సాధారణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ రికార్డులుగా నిర్వహించబడతాయని, వాటిని “కొత్తగా సృష్టించాల్సిన అవసరం” లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
టీజీఎస్పీడీసీఎల్ తన తిరస్కరణకు విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 43 మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన జనరల్ టర్మ్స్ & కండిషన్స్ ఆఫ్ సప్లై (జీటీసీఎస్) నిబంధనలను కూడా ఉదహరించింది. ముఖ్యంగా, జీటీసీఎస్‌లోని క్లాజ్ 5.2.5 “వినియోగదారుడు పొందిన వే-లీవ్, లైసెన్స్ లేదా అనుమతి యొక్క చట్టబద్ధత లేదా తగినంతతను నిర్ధారించుకోవడం కంపెనీకి విధి కాదని” పేర్కొంటుంది. దీని ఆధారంగా, ప్రభుత్వ భూమిపై అనధికారిక కనెక్షన్ల అంశం తమ పరిధిలోకి రాదని టీజీఎస్పీడీసీఎల్ వాదించింది.
అయితే, ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదుతో పాటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు మరియు మండల సర్వేయర్ ఇచ్చిన నివేదికలను జతచేశారు. ఈ నివేదికలు సర్వే నెం. 581/1 ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి. ఇటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, చట్టబద్ధత మరియు దస్తావేజు నిర్ధారణ చేయలేమని డివిజనల్ ఇంజనీర్ తప్పుడు సమాచారం ఇవ్వడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు, విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం “విద్యుత్ దొంగతనం” ఒక నేరం. కనెక్షన్లు విద్యుత్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే (ఉదాహరణకు, మీటర్ లేకపోవడం, అక్రమ కనెక్షన్), టీజీఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటుంది.

అధికారులపై చర్యలు ఆవశ్యకత?
సమాచార హక్కు చట్టం, 2005, ప్రభుత్వ అధికారులకు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిర్దేశిస్తుంది. సమాచారాన్ని అన్యాయంగా తిరస్కరించడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టం యొక్క ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది. సెక్షన్ 20 ప్రకారం, ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సరైన కారణం లేకుండా సమాచారాన్ని తిరస్కరిస్తే, తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం ఇస్తే, లేదా ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని నాశనం చేస్తే, రూ. 250 చొప్పున గరిష్టంగా రూ. 25,000 వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేయవచ్చు.

ఈ కేసులో, టీజీఎస్పీడీసీఎల్ కోరిన సమాచారం తమ రికార్డులలో లేదని చెప్పడం, అది సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే సమాచారం కావడంతో, అధికారుల ఉద్దేశ్యంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సమాచారాన్ని దాచిపెట్టడానికి లేదా దరఖాస్తుదారుడిని నిరుత్సాహపరచడానికి, అక్రమార్కులతో ‘చీకటి ఒప్పందం’ జరిగినట్లు భావించడానికి దారి తీస్తోంది.

కఠిన చర్యలకు డిమాండ్:
సమాజానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు సమాచార హక్కు చట్టం ఒక బలమైన సాధనం. దానిని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్ పొందిన అక్రమార్కులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తిరిగి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest News

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS