- అన్ని పార్టీల్లోనూ విభేదాలు ఉన్నాయి
- ఈటెల, బండి వ్యవహారంపై ధర్మపురి వ్యాఖ్య
పార్టీ అన్నాక వ్యక్తులు, వారి మధ్య విభేదాలు సహజమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉందన్నారు. కుటుంబ పార్టీల్లో కూడా అన్నా చెల్లెళ్లకు, కూడా విభేదాలు ఉన్నాయని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వివాదంపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో నేతల మధ్య ఉన్న వైరంపై కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బుధవారం అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు.. ఆ పార్టీ హై కమాండ్ ఏం చేస్తోంది. అలాగే కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు. బీఆర్ఎస్లో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారు. పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటెల రాజేందర్, బండి సంజయ్ల విషయంలో కూర్చోని మాట్లాడాలని సూచించారు. అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలని చెప్పుకొచ్చారు. ఈటెల, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వయివరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు.
రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ అరవింద్ కోరారు. ఎంపీలు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇదని ఉద్ఘాటించారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని.. బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు.