- మాతృభాష పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం అసనమైంది
- శిక్షణలో సమూల మార్పు అవసరం ` మన శిక్షణ నమూనాలో సానుభూతిని తీసుకురావాలి
- ‘‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా
త్వరలోనే భారత్లో ఇంగ్లీష్లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైందని అయన పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారతీయ భాషల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుండా, మనం నిజమైన భారతీయులుగా ఉండలేమని అమిత్ షా అన్నారు. భారత్లో ఉన్న అనేక భాషలే భారతీయ సంస్కృతికి ఆభరణాలని చెప్పారు. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి… ఏ విదేశీ భాష సరిపోదుని అన్నారు. అసంపూర్ణ విదేశీ భాషల ద్వారా సంపూర్ణ భారతదేశాన్ని ఊహించలేమని, ఈ పోరాటం సులభమైనది కాదని, ఎంత కష్టమైనదో తనకు తెలుసునని… కానీ భారతీయ సమాజం విజయం సాధించి తీరుతుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న ‘‘పంచ ప్రాణ్’’ (ఐదు ప్రతిజ్ఞలు) గురించి కూడా అయన ప్రస్తావిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడం, బానిసత్వం అనే ప్రతి ఆలోచనను వదిలించుకోవడం, మన వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత – సంఫీుభావానికి కట్టుబడి ఉండటం, ప్రతి పౌరుడిలో విధి స్ఫూర్తిని మేల్కొల్పడం… ఈ ఐదు ప్రతిజ్ఞలు 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయన్నారు. అందుకే 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని అశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. దేశంలో పరిపాలనా అధికారుల శిక్షణలో సమూల మార్పు అవసరమని, మన శిక్షణ నమూనాలో సానుభూతిని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న మన పరిపాలనా శిక్షణలో సానుభూతికి చోటు లేదని, బహుశా ఇది బ్రిటిష్ కాలం నాటి ఆలోచనల ప్రభావం కావచ్చన్నారు. అందుకే ఇందులో సానుభూతికి చోటు లేదని, ఏదైనా పాలకులు లేదా నిర్వాహకులు సానుభూతి లేకుండా పాలిస్తే… వారు పాలనకు సంబంధించిన నిజమైన లక్ష్యాన్ని సాధించలేరని నేను నమ్ముతున్నానని అమిత్ షా చెప్పారు.