కమల్హాసన్ మూవీ థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొంది. ఈ చలనచిత్ర విడుదలను అడ్డుకుంటామంటున్నవారిని నియంత్రించాలని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది.

తమిళం నుంచే కన్నడ భాష పుట్టినట్లు కమల్హాసన్ ఈమధ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో థగ్లైఫ్ రిలీజ్ను కర్ణాటకలో అడ్డుకున్నారు. దీనిపై కమల్హాసన్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం.. నిరసనకారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. సినిమా విడుదలకు అడ్డుపడుతున్నవారికి పోలీస్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కమల్హాసన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో సంతృప్తి చెందానని, కేసును ఇంతటితో మూసివేస్తున్నానని తెలిపారు.