అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. నేల మీద పడేసి, చేతులను వెనక్కి గుంజి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఇండియాకి పంపించేశారు. ఈ దారుణాన్ని కునాల్ జైన్ అనే మరో భారతీయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కునాల్ జైన్ తన పోస్టులో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయాన్ని, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను ట్యాగ్ చేశారు. దీంతో యూఎస్లోని ఇండియన్ కాన్సులేట్ స్పందించింది. ఘటన వివరాలను తెలుసుకుంటామని పేర్కొంది. విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ సర్కార్ ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తోందో ఈ ఉదంతాన్నిబట్టి అర్థంచేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధితుణ్ని హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.