11 మంది దుర్మరణం.. 50 మందికి గాయాలు..
ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిన్న (జూన్ 4న బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగటంతో 11 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఊహించనివిధంగా అభిమానులు రావటంతో దుర్ఘటన జరిగింది. గాయపడినవారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఆర్సీబీ 18 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఐపీఎల్ కప్పు గెలిచింది. ఆ జట్టు బుధవారం అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చింది. ఈ సందర్భంగా స్టేడియంలో సెలబ్రేషన్స్కి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వారు బారికేడ్లను, పోలీసులను తోసుకొని స్టేడియం వైపు దూసుకెళ్లారు. దీంతో అభిమానులను అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినా కంట్రోల్ అవకపోవటంతో గ్రూపులు గ్రూపులుగా స్టేడియంలోకి పరుగెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.