- ఆధార్ వివరాలు తీసుకోమంటే విమర్శలా
- భూమన వ్యాఖ్యలపై మండిపడ్డ భాను ప్రకాశ్
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూడంచెల భద్రతలో భాగంగా శ్రీవారి ఆలయం, భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందని భానుప్రకాష్ రెడ్డి ఉద్ఘాటించారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు చేస్తున్న మఠాలు, పీఠాధిపతులంటే టీటీడీకి చాలా గౌరవం ఉందని ఉద్ఘాటించారు. మఠాల్లోనూ భక్తుల ఆధార్ వివరాలు తీసుకొని వసతులు కల్పించాలని నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. తిరుమలలో భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించామని పేర్కొన్నారు. వివరాలు తీసుకోవాలంటే.. హిందూధర్మం, మఠాలపై దాడి అని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడతారా.. అని ప్రశ్నించారు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీయేనని భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ సంస్థలు టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దాతల సహాయంతో చేస్తున్న పనిని కూడా వృథా అనడాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతికే వదిలేస్తున్నానని హితవు పలికారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి క్యూ లైనల్లో పడిగాపులు ఉండటం మంచిదా..? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని వినియోగస్తోందని గుర్తు చేశారు. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే ఏఐ టెక్నాలజీని వినియోగించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని..ఇందులో ఎలాంటి తప్పు లేదని నాయుడు పేర్కొన్నారు.