లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. ఇండియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీ అని, వస్తువుల తయారీ, పంపిణీలో ముఖ్య దేశం కాబట్టి ఈ సదస్సులో పాల్గొనడం అవసరమని కెనడా ప్రధాని పేర్కొన్నారని కిషన్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని, దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఎలా ప్రవర్తించాలో రాహుల్ గాంధీకి తెలియక ఫేక్ న్యూస్ని ప్రచారంలోకి తెస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశం పలు రంగాల్లో విఫలం కావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని విమర్శించారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియ గురించి ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా రాహుల్ గాంధీ అర్థంచేసుకోవట్లేదని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి తప్పుపట్టారు.