- పలుచోట్ల టెలీమెట్రీ ఏర్పాటు చేయాలి
- పోలవరం బ్యాక్ వాటర్ ముప్పు తప్పించాలి
- తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం
- సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44టీఎంసీలను కేటాయించాలి
- పాలమూరు – రంగారెడ్డికి 90టీఎంసీల అవసరం
- కేంద్ర జలసంఘాన్ని కోరిన మంత్రి ఉత్తమ్
కృష్ణా నది నుంచి ఏపి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు నదిపై వివిధ ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కేంద్రాన్ని కోరారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రమాదం ఉందని పేర్కొంటూ రిటెన్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జల సంఘం ఛ్కెర్మన్ అతుల్ జ్కెన్ తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులతో పాటు అనేక అంశాలను చర్చించారు. మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడం పై జాతీయ డామ్ సంరక్షణ సంస్థ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం సమావేశ వివరాలను ఉత్తమ్ వెల్లడించారు. మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ ఇప్పటికే నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మేడిగడ్డ డిజ్కెన్, ఆపరేషన్లో లోపాలున్నాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సరైన మార్గాలను అన్వేషిస్తున్నాం అని పేర్కొన్నారు. డీపీఆర్లో చూపిన స్థలం ఒకటి కాగా, అసలు నిర్మాణం వేరే ప్రాంతంలో జరిగిందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్సీ సూచించిందని చెప్పారు. అలాగే నూతన నిర్మాణాలు, కేటాయింపులపై ఆయన చర్చించారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అలాగే తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇంకా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసిల నీటిని త్వరితగతిన కేటాయించాలని కోరారు. వీటితోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టీ-ఎంసిలు అవసరమని, తక్షణమే 45 టీఎంసులను ముందుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.