- ఎస్.హెచ్.జి లకు, ట్రాన్స్ జెండర్ లకు 290 కోట్ల ఆస్తుల పంపిణీ
- ఐదుగురు ట్రాన్స్ జెండర్ లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
- ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ
- 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మేయర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మేయర్ ప్రసంగంలో జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. జవహర్నగర్లో 24 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, 300 టన్నుల బయో-మెథనేషన్ ప్లాంట్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత అల్పాహారాన్ని ₹5కే అందించే పథకం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
బర్త్, డెత్ సర్టిఫికెట్లను సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సి.ఆర్.ఎస్) పోర్టల్ ద్వారా జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి myGHMC యాప్తో పాటు వాట్సాప్ సదుపాయం, శానిటేషన్ సేవలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల పికప్ బుకింగ్, జీఐఎస్ మ్యాపింగ్, UPI చెల్లింపులు వంటి సాంకేతిక సదుపాయాలు అమలు చేస్తున్నామని వివరించారు.
మౌలిక వసతుల పనులు
రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు H-City ప్రాజెక్ట్ ద్వారా ₹7,032 కోట్ల వ్యయంతో 38 ప్రధాన ప్రాజెక్టులు (47 ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, 10 రోడ్డు విస్తరణ పనులు) చేపట్టినట్లు తెలిపారు. గత SRDP ప్రాజెక్ట్లో 42 పనులలో 37 పూర్తి కాగా, మిగిలిన 5 పనులు 2026 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,806 రోడ్డు పనులు ₹1,046.91 కోట్లతో ప్రారంభించగా, వాటిలో 1,680 పనులు ₹485.05 కోట్ల విలువైనవి పూర్తయ్యాయని తెలిపారు. వర్షపు నీరు నిల్వ సమస్య పరిష్కారానికి ₹14 కోట్లతో 11 భూగర్భ సంపులు నిర్మించగా, 10 పూర్తి చేశామని చెప్పారు.
బ్యూటిఫికేషన్, వరద నివారణ
ఫ్లైఓవర్లు, జంక్షన్లు, ప్రధాన నిర్మాణాల అందాన్ని పెంచేందుకు సుందరీకరణ, కళాత్మక పెయింటింగ్స్, ఇన్స్టాలేషన్లు చేపట్టామని చెప్పారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్ డీ-సిల్టింగ్లో భాగంగా 581 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1302 కి.మీ. పొడవు గల డ్రెయిన్లలో ₹501 కోట్లతో 890 పనులు చేపట్టి, ఇప్పటివరకు ₹209 కోట్లతో 370 పనులు ముగించామని వివరించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాతబస్తీ సహా మొత్తం నగరానికి వరద సమస్యలు రాకుండా స్ట్రామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు.
గౌరవాలు, ర్యాంకులు
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో మిలియన్ ప్లస్ నగరాల విభాగంలో జీహెచ్ఎంసీ 6వ ర్యాంక్ సాధించిందని, గార్బేజ్ ఫ్రీ సిటీస్లో 7 స్టార్ రేటింగ్, ఓడీఎఫ్ వాటర్ ప్లస్ రీసర్టిఫికేషన్ లభించడం గర్వకారణమని అన్నారు.
అసెట్ల పంపిణీ
ప్రసంగం అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్వయం సహాయక సంఘాలు (SHGలు), ట్రాన్స్జెండర్లకు ₹290 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేశారు. వీటిలో 2,597 SHGలకు ₹288.85 కోట్లు, 155 ట్రాన్స్జెండర్లకు ₹55 లక్షలు అందజేశారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రాఫిక్ డిజైన్ శిక్షణ పూర్తి చేసిన 4 ట్రాన్స్జెండర్లకు రెడ్ టివి ఉద్యోగ నియామక పత్రాలు, డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన 5 మహిళలకు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కమిషనర్లు రఘుప్రసాద్, వేణుగోపాల్, సుభద్రదేవి, పంకజ, సిసిపి శ్రీనివాస్, ఏఎస్పీ సుదర్శన్, ఏఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.