- 10 ఏండ్లలో సుమారు 2000 బడులు మాయం..
- రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు..
- ప్రయివేట్ విద్యా సంస్థలను నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం..
- కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా..? చదువు కొనాలా..?
- ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్ కే జీ ఫీజులు
- 33 జిల్లాలకు ముగ్గురు డీఈఓలే, మిగిలినవారు ఎఫ్ఏసీలు..
- చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు.. ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు..
- చదివిన సదువులతో కొలువులు తెచ్చుకోలేని నిస్సహాయత..
- బతుకు భారమై.. బడి చదువులు దూరమై..చావలేక బ్రతకలేక
- బ్రతుకులో నటిస్తూ.. పాలకులే దేవుళ్లని బ్రతుకంతా నమ్ముతూ..
- తమ బతుకులని, తల రాతలని మారుస్తారని కోటి ఆశలతో..
- ఎదురు చూస్తున్నారు కోట్లమంది..
( నమ్మకమే వెన్నుపోటు పొడిస్తే గుండెల్లో ఊబుకుతున్న బాధను పంటికింద అణచుకుని, దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ సామాన్యుడి కన్నీటి గాథే ఈ కథనం.. ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేకం.. ) - కె. వాసు కుమార్ బ్యూరో రిపోర్టర్
చదువు సంస్కారం నేర్పుతుంది.. ఉపాధినిస్తుంది..ఉన్నత స్థాయిని కల్పిస్తుంది.. ఇవన్నీ ఒకప్పుడు నిజమై నిరూపించిన మాటలు.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఈ పదాల అర్థాలు మారిపోయాయి.. స్టేటస్ కోసం చదువు.. కట్న కానుకల కోసం చదువు.. పేరు వెనుక రాసుకోవడానికి చదువుకున్న డిగ్రీలు.. దీనికోసం లక్షల్లో ఫీజులు.. పుట్టుకతో కోటీశ్వరుడు అయిన వారికి ఇవన్నీ సాధ్యం అవుతాయి.. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటీ .? బూజుపట్టి పోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడినపడేది ఎప్పుడు..? నిరుపేదల సంకల్పం నెరవేరేదెన్నడు..? కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకుని విల విలలాడిపోతున్న సరస్వతి తల్లికి విముక్తి ఎలా సాధ్యం అవుతుంది..? ఎప్పుడు సాధ్యమవుతుంది ..?

ప్రభుత్వ విద్యాలయాలు ఏ ఏడాదికాఏడాది పూర్తిగా అంతరించిపోతున్నాయి. గడిచిన పదేండ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 2000 పైగా సర్కారు బడులు మూతపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి…ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి సుమారు 500 పైగా సర్కారు బడులు మూతపడుతున్నాయి.. ఈ ఏడాది 2025-2026 కూడా మరి కొన్ని బడులు జీరో అడ్మిషన్స్ కారణంగా మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.. ఇలా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిపోవడానికి కారణం టీచర్లే అని స్థానిక అంశాలను బట్టి చూస్తే అర్ధం అవుతోంది..నిజానికి అత్యధిక సంఖ్యలో టీచర్లు సమయానికి బడికి రావడంలేదు.. వచ్చినా పాఠాలు చెప్పడంలేదు. వీరికి ఉపాధ్యాయ సంఘాలు, స్థానిక బడా నేతల అనుచరులు బలమైన శక్తి పీఠాలుగా ఉండి, టీచర్ల ఎగవేతలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు…
ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి వంటి సమస్యలు ప్రధానంగా కనబడుతున్నాయి.. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా చెప్పొచ్చు .. 5 తరగతి నుంచి ప్రభుత్వ బడులలో తరగతులు ప్రారంభం అవ్వడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది.. ఇలా చెప్పుకుంటూ పొతే బడుల మటుమాయానికి చాంతాడు లిస్టే ఉంది.. పాలకుల లెక్కలేని తనం… విద్యాశాఖ అధికారుల అలసత్వం… ప్రభుత్వాల కపటప్రేమ కూడా ప్రభుత్వ పాఠశాలల అంతానికి కారణాలుగా చెప్పొచ్చు.. పోలీస్ శాఖ.. రెవెన్యూ శాఖ.. ఎక్స్చేంజి వంటి ఆదాయం తెచ్చే ప్రధాన శాఖలలో బదిలీలు .. పదోన్నతులు .. నియామకాలు .. ఆ శాఖకు ప్రాతినిత్యం వహించే మంత్రులు ఇలా ఆ శాఖలు మూడు పూవ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతుంటే.. ప్రభుత్వాల పుణ్యమా.. అని విద్యాశాఖ మాత్రం ప్రాతినిత్యం లేక బిక్కుబిక్కుమంటూ మూలన కూర్చుంది… దీంతో ప్రయివేట్ విద్యా రంగం రెక్కలు విచ్చుకున్న పక్షిలా మారి తల్లి దండ్రుల నెత్తిమీద కూర్చుని విలయ తాండవం చేస్తోంది..

అడ్డు అదుపులేని ఫీజులతో తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని దర్జాగా దోచేసుకుంటుంది.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నేలా ఎల్ కే జి ఫీజులు ఉండటాన్ని గమనిస్తే ప్రయివేట్ రంగం దోపిడీ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.. పుస్తకాలు, డ్రెస్సులు, బస్సు, ట్యూషన్, ఎక్స్ట్రా ఆక్టివిటీ పేరిట ప్రయివేట్ విద్యా సంస్థల నిర్వాహకులు వసూలు చేస్తున్న మొత్తాలు లక్షలు దాటుతున్నాయి.. ప్రయివేట్ విద్యా సంస్థల అడ్డూ.. అదుపులేని ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలను తల్లి దండ్రులు కోరినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు..
కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకొనలేని పరిస్థితి :
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా విద్యావ్యవస్థ మెరుగుపడకపోవడానికి కారణం పాలకుల అసమర్ధ నిర్ణయాలే అని చెప్పక తప్పదు.. పేరుకే సంక్షేమాలు … ఆచరణలో సాధ్యం చేయలేని ఆర్థిక పరిస్థితి… ప్రయివేట్ సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులను నిలువరించలేని స్థితిలో ప్రభుత్వం, చదివిన సదువులతో కొలువులు తెచ్చుకోలేని నిస్సహాయత.. ఇలా సమస్యల వలయంలో విద్యారంగం చిక్కుకుని సామాన్యుల జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే పాలకులు వేడుక చూస్తుండిపోవడం ఎంతవరకు కరెక్టో పాలకులే చెప్పాలి.. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా సామాన్యుడు బతుకలేని దుస్థితి , చదువుకొనలేని పరిస్థితి.. ఎదురైనప్పుడు ఎందుకు రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లో అర్ధం కావడంలేదు..

హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే కనీస అవసరాల లేమి స్పష్టంగా కనబడుతుందంటే … అత్యంత మారుమూల ఆదివాసీ గూడాలలో, పల్లెలలో గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల దుస్థితి ఇంకా ఎంత దయనీయంగా, అధ్వానంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో సుమారుగా 25,000 ప్రభుత్వ బడులు ఉండగా, వాటిలో సుమారు 30 లక్షలకు మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులవుతున్న విద్యార్థుల తల్లి దండ్రులను సర్కారు బడులలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది..
విద్యా శాఖ అధికారులు కూడా బడులకు మంగళం పాడేస్తున్నారు :
ఒకపక్క సమస్యల లేమి.. మరోపక్క స్థానిక నేతల మితిమీరిన అనవసరపు జోక్యం.. విద్యార్థుల చదువులను చిదిమేస్తున్నాయి.. గ్రామస్థాయిలో బడులకు చీపురు పుల్ల కూడా కొనివ్వలేని నిస్సహాయత కలిగిన ఆసాముల పెత్తనాలు.. బడులపై ఎందుకు కొనసాగుతున్నాయో ప్రభుత్వమే పరిశీలించాలి.. ఇలా సమస్యల ముప్పేట దాడి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే బడులు మటుమాయం కాక ఎటుపోతాయి… కేజీ నుంచి పీజీ వరకు చిరు ఉద్యోగి నుండి కలెక్టర్ వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా అంతరాలు లేని సమాన అవకాశాలతో కూడిన విద్యను అందిస్తామని తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావంలో ప్రగల్బాలు పలికిన పెద్దలు తాము చెప్పిన మాటలను ఎప్పుడో మరిచిపోయారు..
శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల భవనాలు.. అరకొర వసతులు..టీచర్ల కొరత..పురుగులు పట్టిన కాయగూరలతో, నీళ్ల చారుతో వేడిగా..వండి వడ్డిస్తున్న భోజన పథకాలు, అందని పాఠ్య పాస్తకాలు..లక్షల్లో జీతాలు తీసుకుంటూ చదువు చెప్పనని మొరాయిస్తున్న టీచర్లు.. వారికి అండ దండలుగా నిటారుగా నిలబడుతున్న జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా బడులకు మంగళం పాడే కార్యక్రమంలో బాగస్వామ్యులయ్యారు..
టీచర్ నుంచి పాఠశాలలను పర్యవేక్షించే వరకు అన్ని పోస్టులు ఖాళీ :
ఆర్టీసీ బస్సుల్లోని ఉద్యోగుల మాదిరిగా డ్రైవర్ పని కండక్టరు పని డ్రైవర్ చేసే విధంగా ఒక సర్దుబాటు వ్యవహారం విద్యాశాఖలో కూడా నడుస్తోంది.. ఒకే టీచరు అన్ని తరగతులు బోధిస్తే మెరుగైన విద్య… బడిచదువులు చదువే విద్యార్థులకు ఎలా వస్తుంది. ఆటలు, పాటలు అంటూ ప్రకటనలతో ఊదరకొడుతున్న ప్రభుత్వం క్రీడలకు సంబదించిన టీచర్లను నియమించడం లేదు.. ఇక ప్రయివేట్ బడులు కూడా క్రీడలంటే ఆసక్తి చూపడంలేదు.. ఎన్.సీసీ, ఎన్ఎస్ఎస్, వంటి శిక్షణ కొన్ని బడులకు మాత్రమే పరిమితమయ్యాయి..
నిజానికి రాష్ట్రంలోని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలి కానీ ఆలా ఎక్కడా జరుగడం లేదు.. పాఠశాల విద్యా భాగంలో చదువు చెప్పే టీచర్ నుంచి పాఠశాలలను పర్యవేక్షించే టీచరు వరకు అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక బడులలో గ్రంధాలయం అనే మాటే ఉండటం లేదు.. బడులలో పిల్లలను ఆడించే అట స్థలాలు , చెట్లు , క్రీడా వస్తువులు లేనే లేవు.. అద్దె భవనాలలో యంత్రాల పనిముట్లను తయారుచేసినట్లు బావితరాల ఆశా కిరణాలను బడులనే బంధీ ఖానాలో తీర్చిదిద్దుతున్నారు..
అత్యధికంగా ప్రైవేట్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువ :
రాష్ట్రంలో 18, 259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా వీటిలో 6,94,968 మంది విద్యార్థులున్నారు. అనగా ఒక బడిలో సగటు విద్యార్థుల సంఖ్య 38 మాత్రమే. ఇక 3, 143 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలుంటే వీటిలో విద్యార్థుల సంఖ్య 1,91,178గా ఉంది. అంటే ఒక బడిలో సగటున 60 మంది విద్యార్థులున్నారు. ఇక 4,704 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 7,99,589 ఉండగా… ఈ లెక్కన సగటున ఒక బడిలో ఉంది 169 మంది విద్యార్థులు మాత్రమే..మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,757 ఉండగా, వీటిలో ఏకంగా 37,26,200 మంది విద్యార్థులన్నారు. ఒక ప్రైవేట్ స్కూళ్లో సగటు విద్యార్థుల సంఖ్య 316గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 60లక్షలకు పైగా విద్యార్థులున్నారు.. వీరిలో అత్యధికంగా ప్రైవేట్ స్కూళ్లల్లో చదువుతున్నట్లు తెలుస్తోంది..
33 జిల్లాల్లో ముగ్గురు మాత్రమే డీఈఓలు ఉన్నారు :
రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా అందులో ముగ్గురు మాత్రమే డీఈఓలుగా పనిచేస్తున్నారు.. మిగిలిన వారు అర్జెస్ట్మెంట్ లో భాగంలో ఎఫ్ఏసీలుగా కొనసాగుతున్నారు.. అలాగే మండల విద్యాధికారుల పోస్టుల్లోనూ 95 శాతం మంది ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు. ప్రధానోపాధ్యాయులు 4252 కావాల్సి ఉండగా 2270 మంది మాత్రమే ఉన్నారు. 10 డైట్ కాలేజీలు ఉండగా అందులో 6 ఖాళీగా ఉన్నాయి. 70 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. దీంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం లేదు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది..
సర్కారు బడులను బ్రతికించేదెలా..?
సర్కార్ బడులను బ్రతికించాలని ప్రభుత్వం నిజంగా అనుకుంటే మూసిన బడులన్నీ చిటికలో తెరుచుకుంటాయి.. ఇప్పుడు ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రముఖుల్లో చాలా మంది ప్రభుత్వ బడులలో చదువుకున్నవారే.. అందుకే ప్రభుత్వ బడుల గురించి వివరంగా చెప్పాల్సిన పనే లేదు.. బడులలో నర్సరీ నుంచి విద్యను అందుబాటులోకి తెస్తే ఎన్నో బడులు విద్యార్థులతో కిటకిటలాడుతాయి..5 వ తరగతి నుంచి తరగతులను ప్రారంభించడం వలన విద్యార్థులు వారి తల్లి దండ్రులు సర్కార్ బడులపై ఆసక్తిని చూపడంలేదు..
విద్యార్థుల కు ఫేస్ ఐడెంటిటీ అటెండెన్స్ పెట్టినట్లు టీచర్లకు కూడా పేస్ ఐడెంటిటీ అటెండెన్స్ పెట్టాలి. అప్పుడే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి..బడులలో వసతులు, మరమ్మత్తులు చేపట్టి అవసరం మేరకు టీచర్ల నియామకాలు జరపాలి.. ఇన్ టైం లో పుస్తకాలు ..బట్టలు ఇవ్వాలి ..అప్పుడు సర్కారు బడులకు డోకా ఉండదు.. మరి ఇదంతా చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తుందా..? లేదా అన్నది వేచి చూడాలి మరి..?