- వడ్డీతో సహా చెల్లించడం ఖాయం
- ఈ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది
- రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితి
- కావాలనే తన పర్యటనలో రెచ్చగొట్టే చర్యలు
- చేసిన అప్పులకు చంద్రాబు లెక్కలు చెప్పాలి
- మీడియా సమావేశంలో మండిపడ్డ జగన్
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అభాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఎవరికీ ఏ స్కీమ్ ఇచ్చింది లేదు అని, మరి ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో తెలియదన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకో అని, ఆలోచన మార్చుకో అని వైఎస్ జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ’18 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపారు. ఏం పెరిగినా ఎవరూ మాట్లాడకూడదు, పెరిగిన బ్రతుకు భారం గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. నాణ్యత లేని పనులు జరిగినా.. ఒక్క రూపాయికే భూములు ఇస్తున్నా ప్రశ్నించకూడదు. మేం మంచి జరిగేలా పీపీఏలు చేసుకున్నా.. ఇవాళ 4.60 రూపాయలకు పీపీఏ చేసుకున్నా అడగకూడదు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ఆగేది లేదు. చంద్రబాబు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత అన్నీ చెల్లిస్తాం అని హెచ్చరించారు.