- ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం
- తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేద్దాం
- భాషా,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిందే
- ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జస్టిస్ ఎన్వీరమణ పిలుపు
‘తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు‘ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘తెలుగు భాషా, సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతాం. జాతి మనుగడకు, వికాసానికి ధైర్యం కావాలి. భాష లేకపోతే.. ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులం అవుతామన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి, భాషను మరిచిపోకూడదని.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని నేను. తెలుగు భాషను దేశంలో వంద మిలియన్లకు పైగా మాట్లాడతారు. తెలుగుభాష పలుకుబడి వినసొంపైనది. అది సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును.. వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదన్నారు. మన సంస్కృతి, భాష చిరకాలం నిలిచి ఉండేలా.. శ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారెలాంటి గొప్ప కవులు, రచయితలు.. భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, గుమ్మడి, జగ్గయ్య, అక్కినేని, ఎన్టీఆర్, రేలంగి, ఎస్వీఆర్, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనది. ఈ వారసత్వం మరవకండి. విూరు గుర్తుంచుకోండి.. విూ పిల్లలకు గుర్తు చేయండి. ’భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం. ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితోపాటు.. భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలన్నారు. ‘ఎన్టీఆర్ వల్ల తెలుగు భాషకు.. ప్రజలకు గౌరవం పెరిగింది. ప్రభుత్వ అవార్డులకన్నా.. సమాజాన్ని మేల్కొలిపే రచనలే మిన్న. తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలి. పత్రికలు, ఛానళ్లు తెలుగు అభివృద్ధికి పాటుపడాలి. తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభివృద్ధికి కృషి చేయాలి. తెలుగుకు మద్దతిచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించాలి. అలా చెప్పిస్తేనే.. మాతృభాష అభివృద్ధి, వైభవం దక్కుతుంది‘ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుది శ్వాస వరకూ తెలుగు భాష, సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభా వేదిక నుంచి మిమ్మల్నందర్నీ చూస్తుంటే.. యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోందని అన్నారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సాహిత్యం, వైభవం గురించి అనర్గళంగా ఇక్కడ మాట్లాడారన్నారు. తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. ఒక సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని విమర్శించారు. తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని.. తెలుగు భాష వృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టింది లేదన్నారు. కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని వెల్లడిరచారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు. ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
‘పర భాషను నేర్చుకోండి… వ్యామోహం పెంచుకోకండి. నా సంస్కృతి నాశనం కాకుండా చూడాలని గాంధీజీ చెప్పేవారు. మాతృభాషలో విద్యను అభ్యసించి చాలా మంది ఉన్నత స్థితికి చేరారు. పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారు. తెలుగు భాషలోచదివి… దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో. ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలి. తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్టాల్రకు కీర్తి ఉంటుంది. మన ఆచార, వ్యవహారాలు సక్రమంగా అమలు చేయాలి. అభివృద్ధితో పాటు భాషా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి‘ అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడిరచారు. మాతృభాషపై మమకారం ఉన్న వారి వల్లే మన భాషకు గౌరవం దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ వంటి వారి వల్ల మన భాషకు, మన తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందన్నారు. మానవ బంధాలతో కూడిన రచనలే కలకాలం ప్రజల్లో నిలుస్తాయని.. కన్యాశుల్కం వంటి రచనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కన్నా… సమాజాన్ని మేల్కొలిపే రచనలే మిన్న అని తెలిపారు. తెలుగు భాషను పరిపుష్టం చేయాలనే ఆలోచనపై ప్రభుత్వం సానుకులంగా స్పందించాలని కోరారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని.. లేదంటే భవిష్యత్తులో తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదన్నారు. ‘తమిళనాడులో అక్కడ భాషాభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని.. ఆ తరహాలో మన దగ్గర పాలకులు స్పందించడం లేదు. అక్కడ ఉన్న ఐక్యత, మన దగ్గర లేదనేది వాస్తవం. కవులు, భాషాభిమానులను చూసి ప్రభుత్వాలు భయపడవు. ప్రజలను కూడా తెలుగు భాషోద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ప్రజల మద్దతుతో మన ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలుగు భాషకు మద్దతు ఇచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించండి. అప్పుడే మన భాష అభివృద్ధి, వైభవం తప్పకుండా సాకారం అవుతుందని ఎన్వీ రమణ పేర్కొన్నారు.కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భాష అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేసేలా ఇచ్చిన జివో 85ను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుపై దృష్టి పెట్టాలన్నారు. తెలుగు భాష ప్రాధికారిక సంస్థను మళ్లీ పునరుద్ధరించాలన్నారు. 2019 కి ముందు చంద్రబాబు ఏర్పాటు చేసినా.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ మహాసభల ద్వారా కవులు, రచయితలకు ప్రోత్సాహం అందించాలని.. వారికి భాషాభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించాలన్నారు. ‘తెలుగువారి శక్తి… తెలుగువాడి నాడి వ్యాపించాలి.. నేను కోరుకునేది అదేనంటూ ముగించారు.